నాల్గవ ప్రకరణము.
269
శ్వరుఁడు నన్ను కార్యవాదినిగాఁగాక ఖడ్గవాదినిగా సృజియించియున్నాఁడు. ఈయవమానము యాచింపఁబోయినందువలనఁ గలిగిన ఫలముగదా యని మనస్సులో పరితాపమునొంది, యిఁక ముందెవ్వరిని యాచింపఁబోఁగూడదని నిశ్చయము చేసికొని, మఱియెవ్వరియింటికినిబోక యోడనెక్కి రాజమహేంద్రవరమున మాయింటికే పోయితిని. ఈసారి యైనప్రయాణవ్యయములను మాత్రము నేను పోగుచేసిన చందా సొమ్ములోనుండి పుచ్చుకొని, శేషమును సమాజము వారికిచ్చితిని. రాజమహేంద్రమువరములోని మాసామాజికులు నెల చందాల నిచ్చుచుండుటయేకాక వారిలో ననేకులు పెద్ద మొత్తములను సహితము దయచేసిరి. న్యాపతి సుబ్బారావు పంతులుగారు మున్నూఱు రూపాయలిచ్చిరి ; వాడ్రేవు చలమయ్యగారిన్నూఱు రూపాయలిచ్చిరి ; కంచి కృష్ణస్వామిరావు పంతులుగారును, సీ. నాగోజీరావు పంతులుగారును, ఆత్మూరి లక్ష్మీనరసింహము సెట్టిగారును, నూఱేసి రూపాయలిచ్చిరి. ఏఁబదిరూపాయలిచ్చిన వారొక్కరును, ఇరువదియైదేసి రూపాయ లిచ్చినవారు ముగ్గురును, పదునైదేసి రూపాయలిచ్చిన వారిద్దఱును, పదేసి రూపాయలిచ్చిన వారునలుగురును, ఉండిరి. మావిజ్ఞాపనపత్రికను జదివి సహాయులైన వారిలో బెంగుళూరులోని యున్నత న్యాయసభలోని న్యాయాధిపతి (Judge) యైన ఏ. రామచంద్ర అయ్యరుగారు వివాహమొకటికి నూఱేసి రూపాయలు పంపుచుండుటయేకాక, ఆఱేసి నెలలకు నూఱురూపాయలు చందా నిచ్చు చుండిరి; ఇటీవల రావుబహదూరు ఏ. సభాపతి ముదల్యారిగారు వివాహ మొకటికి నూఱేసిరూపాయలచొప్పున బళ్లారినుండి పంపు చుండిరి. ఇట్లు సేకరించిన ధనముతో సమాజమువారు నెలజీతము లియ్యవలసినవారికిచ్చుచు, వివాహములు చేసికొన్నవారికి కావలసిన సహాయముచేయుచు, మిగిలినదానితో వివాహములు చేయుచుండిరి. ఈ సంవత్సరము డిసెంబరునెల 20 వ తేదిని జరగిన 13 వ వివాహమునకయిన మున్నూఱు రూపాయలును రామకృష్ణయ్యగారు రహస్యముగా నాయొద్దకుఁబంపిరి. ఈవివాహమునందు వరుఁడు పటా