మున్నట్టుకూడఁ గనుపట్టుచున్నది" అని రాజు బహుమానునకు జూపెను. ఇంతలో మిత్రవింద "దేవరవారి కిప్పుడు గలిగిన సంతోషమునుబట్టి విచారింపగా అది జీవించియున్నదని సహితము తలంతురు. ఇప్పుడు నేను తెరవేయవలెను" అనెను. రాజు "మిత్రవిందా! ఇరువది సంవత్సరము లయినను నన్నాలాగుననే తలఁచునట్లు చేయుము. ఇప్పుడును ఆ దివ్యసుందర విగ్రహమునుండి యూపిరి వచ్చుచున్నట్లే నాకుఁ గనబడుచున్నది. ఎంతవింతయులియైనను విగ్రహమున కూపిరివచ్చునట్టు చెక్క గలుగునా? దానిని పోయి యొక్కసారి ముద్దుపెట్టుకొనెదను; మీరెవ్వరును బరిహసింపకుడు" అని మోహపరవశు డయి పలికెను. "దేవా! తాళుఁడు, ఆమె పెదవికివేసిన యెఱ్ఱరం గింకను పచ్చిగానే యున్నది; మీరు ముద్దుపెట్టుకొందురేని మీపెదవి కంటుకొనును. నేను తెర దిగవేయుదునా?" అని మిత్రవింద యడిగెను. "వద్దువద్దు" ఇరువదియేండ్లయినను అలాగుననే యుండనిమ్మ"ని రాజు వేఁడుకొనెను.
ఈ సంభాషణము నడుచుచున్నంతతడవును మోకాలిమీఁద నిలువబడి నోరు కదలింపక సావధానముగా జనని యొక్క నిరుపమానమైన విగ్రహమువంకనే చూచుచున్న ప్రమతి "నా ప్రియమాతవంక జూచుచు, ఎంతకాలమయిన నీప్రకారముగా నిలుచుచుండగల"నని పలికెను. అంతట మిత్రవింద రాజువంక జూడ్కి నిగిడించి, 'యీ యాలోకనసౌఖ్య