కాశ్మీర దేశమున దక్కువగానుండి తనదేశమున బుష్కలముగా నుండు విలువయైన వస్తువులను సేకరించి తన బండియం దుంచుకొనెను. ఇంకను విస్తారమయిన పలురకములయిన వస్తువులను సంపాదించి పెక్కు బండ్లనిండ వేయించెను. మరికొన్ని సామగ్రులను కావళ్ళతో గొనిరా సేవకులను నియోగించెను. ఈవిధముగా దగుపరివారమును గూడబెట్టుకొని వర్ధమానుడు వాణిజ్యమునకై కాశ్మీరదేశమునకు బయనమాయెను. సమర్థులకు జేయరాని పనియు, నుద్యోగులకు దూరభూమియు, బండితులకు బరదేశమును, బ్రియమైన మాట లాడువారికి శత్రువులును గలుగరు.
వర్ధమాను డటులు బయలుదేఱి సుదుర్గపర్వత సమీపమందలి యడవి మీదుగా బోవుచుండెను. ఆ యరణ్య ప్రదేశమున దారి సమముగా నుండక మిట్టపల్లములుగా నుండుటవలన నొక చోట సంజీవకము కాలుజాఱి పడిపోయెను, ఈవిధమున గాలు విఱిగి పడిపోయిన సంజీవకముం జూచి వర్ధమాను డిట్లు చింతంచెను.
"పురుషు డెంతప్రయత్నము జేసినను దైవానుకూల్యమును బట్టియే యది ఫలించుచుండును. ఊరక విచారించిన నించుకంతయు బ్రయోజనములేదు. కావున బురుషుడు వృథావిచారము మాని కార్యసిద్ధికై మరలమరల యత్నింపవలయును." ఇట్లు నిశ్చయించి సంజీవకము కాడికట్టు వదలించి సేవకులను బంపి యచ్చటికి సమీపమునున్న ధర్మపుర