21 ఆదర్శము
పాపమూర్తులు పలుమారు చూస్తే మానసము పాపావిల మవునట్లు ధర్మజ్యోతిని పలుమారు చూస్తే పాపము దూరమగుటే కాక మన హృదయములందు పుణ్యము నెలకొనును. ధర్మమూర్తులగు యుధిష్ఠరశ్రీరాముల చరితములు పలుమారు పరిశీలనము చేస్తే మన మానసము పవిత్రమవుతుంది. అందరియందు నట్టి సౌశీల్య ముండదు. మానవుల చిత్తవృత్తు లెంత పుణ్యమయములై అసాధారణసౌందర్యమున విలసిల్లుచున్నా, శ్రీరామయుధిష్ఠిరుల వృత్తములు వారి కున్నతి చేకూర్చునే కాని అవనతి కల్గింపవు. పుణ్యాత్ముల ఆకర్షణశక్తి, పవిత్రశీలుల సౌందర్యము, ధార్మికుల ప్రభావము, మానవమానసముల నాకర్షింపక యుండలేవు; కావున అందు కనుకూలమగు తీరున సంఘములను కవులు చక్క జేయవలయును. ప్రకృతిచేతనే మానవులయందు దైవీ ప్రవృత్తిబీజము లున్నవని చెప్పియుంటిమి. అందుకే అనేక శతాబ్దములక్రిందట ఆర్యసాహిత్యమందు సంచిత మొనర్చిన ధర్మబలము ఇప్పటికిన్నీ హిందూసంఘముల నడిపించుతూ, అందలి పవిత్రప్రవృత్తుల రక్షణ చేయుచూ, అసాధారణ ధార్మికప్రవృత్తుల నతిశయింపజేయుచున్నది. చూచితిరా పుణ్యాదర్శముల ప్రభావము!
సాహిత్యమున అలౌకిక సాధన -
సర్వసాధారణము కానిది అలౌకికము. అసామాన్యములు అలౌకికములు కాకుండుటచేతనే సాధారణమానవుల