నవనాథచరిత్ర
పీఠిక.
ఆంధ్రవాఙ్మయమున ద్విపద కవిత్వమును జెప్పి ప్రసిద్ధినందిన వారిలో గౌరన మంత్రి యొకఁడు. ఈతని 'హరిశ్చంద్ర' ద్విపద కొంతకాలము క్రిందటనే ముద్రితమై ప్రకటింపఁబడి యుండుటచే నాంధ్రలోకమునఁ బ్రచారముఁ గాంచినది. కాని యీ నవనాథచరిత్రము కేవలశైవగాథాప్రతిపాదిక మగుటచేతనో, దేశమున ద్విపదకవిత్వమం దాదరము తగ్గుటచేతనో, గ్రంథముయొక్క నిర్దుష్టములగు వ్రాఁతప్రతులు లభింపక పోవుటచేతనో, దీని కట్టి భాగ్య మబ్బలేదు. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున తాళపత్ర గ్రంథ మొక్కటియే కలదు. ఇది పెక్కులేఖక ప్రమాదములతోఁ గూడియేయున్నది. మఱికొన్ని కాగితపు వ్రాఁతప్రతులు నా తాళపత్ర గ్రంథమునకుఁ బుత్రికలే యనఁదగియున్నవి. పూర్వాంధ్రకవులలోనివాఁడగు గౌరనామాత్యుని యీ గ్రంథమింకను ఖిలము గాకుండ నిలువఁబెట్టవలయు నను తలంపుతో నిప్పటికి లభించిన సామగ్రినిబట్టి యీ గ్రంథము ముద్రింపఁ బడినది.
కవివంశాదికము.
కృతికర్త యగు గౌరనమంత్రి గౌతమగోత్రజుఁడు. అయ్యల మంత్రికిని పోచాంబకును బుత్రుఁడు. భ్రమరాంబికా వరప్రాప్త విచిత్ర విమల సాహిత్య ప్రవీణాధికుండు. ఈతని తండ్రిపేరు ఎల్లమంత్రి యగునని హరిశ్చంద్రద్విపదను బట్టి కవుల చరిత్రకారులు నిర్ణయించిరి. అందు-
"సింగన మాధవక్షితిపాల మణికి
మంగళమూర్తికి మంత్రియై జగతిఁ
బొగ డొందు పెద్దన పోతరాజుకును
దగిన తమ్ముఁడు యశోధనుఁ డెల్లమంత్రి
చెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి"
అని కృత్యాదిని కలదు. కాని గ్రంథాంతమున-
"మతిమంతుఁ డయ్యల మంత్రిపుంగవుని
సుతుఁడు గౌరనమంత్రి సుకవిశేఖరుఁడు" అని యున్నది.
ఇట్లు మొదటనున్న 'యశోధనుఁ డెల్లమంత్రి' యనుదానిని దిద్దుట కవకాశము లేదనియు, తుదినున్న 'మతిమంతు డయ్యల మంత్రిపుంగవుని'