ఈ పుట ఆమోదించబడ్డది
కొడుకుం గోడలి గౌగిలించుకొని యానందబాష్పములని యెడి ముత్యాల సేసలు వారిపై చల్లెను. నానకు రాకవిని చుట్టములు నెచ్చెలులు పరిచితులు వానిం జూడవచ్చి యతడు మంచివృత్తిలో బ్రవేశించినందుకు ధనము సంపాదించుచున్నందుకు జాల సంతసించి కొనియాడిరి. కొడుకక్కడనున్న నెల దినములలో దండ్రి సహజముగ గఠినుడయ్యు మరల నేమి సాహసము పుట్టునో యను భయమున నేమియుననక నడుమనడుమ నెవరితోనో యన్నట్లు "ధనము సంపాదించుట మంచిది. ధనములేనివారి నెవరుజూడరు. దుస్సహవాసములుచేయగూడ"దనుచు నెమ్మదిగ గాలము వెళ్ళబుచ్చెను. ఆమాసము ముగిసినపిదప నానకు భార్యాసమేతుడై సుల్తానుపురమునకు బోయి యెప్పటియట్ల తనపనిలో బ్రవేశించెను. పుట్టినింటివారు చూనీదేవిని మరల స్వల్పకాలములోనే బంపుదుమని చెప్పితీసికొనిపోయిరి.