వారు ప్లానింగ్ కమీషన్లో ఈ విషయం సరిచేస్తామని, కృష్ణమాచారిగారి అడ్డు ఉండదనీ చెప్పినమీదట నేను కర్నూలు తిరిగి వచ్చేశాను.
మరికొన్ని రోజులకు ప్లానింగ్ కమీషన్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కృష్ణమాచారిగారినుంచి ముఖ్యమంత్రి ప్రకాశంగారికి ఒక ఉత్తరం వచ్చింది. అందులోని సారాంశ మిది: "కృష్ణానదిపై, ఏ మేజరు ప్రాజెక్టు కావాలో మీ రిదివరకు ప్లానింగ్ కమీషనుకు తెలియజేయలేదు. కాబట్టి, మీ కేదైన స్కీము ఉంటే, తొందరగా తెలియజేయ వలసింది."
ఈ ఉత్తర మెంత అసందర్భమైనదో వేరే చెప్పనక్కరలేదు. కానీ, అది వచ్చేసరికి ఆంధ్రప్రభుత్వ పరిస్థితులు విషమస్థితిలోకి వచ్చేశాయి. పైన చెప్పిన వివరాలతో ఆయనకు జవాబు వ్రాశాము.
అంతట్లో ఆంధ్రప్రభుత్వం పతనమయింది.
తరువాత, పత్రికలలో - ప్రకాశంగారి (ఆంధ్ర) ప్రభుత్వం నందికొండ ప్రాజెక్టుపై ఇదమిత్థమని నిర్ణయం చేయలేదనీ, గవర్నరు త్రివేదిగారు తమకున్న పలుకుబడితో ప్లానింగ్ కమీషనువారిని కలుసుకొని స్కీము శాంక్షను చేసి తెచ్చికొన్నట్లుగానూ వార్త పడింది.
గవర్నరు ప్రభుత్వం ముగిసిన తర్వాత, సంజీవ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా, నెహ్రూగారు స్వయంగా వచ్చి - ఆ ప్రాంతంలోనే నాగార్జునుడనే ప్రపంచ విఖ్యాత బౌద్ద విద్వాంసుడూ, రసాయన శాస్త్రవేత్తా తపస్సు చేసిన పవిత్ర పర్వతం ఉండడంవల్ల ఆయన పేరిట, మొదట అనుకొన్న 525 అడుగుల ఎత్తుతో, శాంక్షను అయిన జలాశయానికి పునాదులు వేశారు.
ఆంధ్ర హైకోర్టు వ్యవహారం [1]
మన సంవిధానం ప్రకారంగా - ఏ రాష్ట్రమైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా ఉంటే, ఆ ప్రక్క - రాష్ట్రం హైకోర్టుకు క్షేత్రాధి
- ↑ ఈ అధ్యాయంలో కొటేషన్ మార్కులలో ఉంచిన మాటలు, అసలు మాట్లాడిన మాటలకు సారాంశము.