ఓరుంగల్లు
135
రుద్ర: పక్కవారు చాళుక్య.....
అన్నాం: చాళుక్యఅంటే? ఇద్దరు చాళుక్యు లున్నారా ఏమిటి?
ముమ్మ: నాకు తెలియదు.
అన్నాం: చాళుక్యవీర....
ముమ్మ: అదే చాళుక్య...
అన్నాం: చాళుక్య మహా....
రుద్ర: అదే చాళుక్య....
అన్నా: సరేలెండి !
నాకు తెలిసిందమ్మ నాకు తెలిసింది
దొంగలిద్దరి గుట్టు దొరసాని వినవె!
రుద్ర: ఒక తాయిలంగారికి దొంగలంటే మా ఇష్టంట. దొంగ అనే మాట వినగానే వసంతంలో మల్లెలు వికసించిన ట్లయిపోతుందట!
ముమ్మ: దొంగలంటే నాకు భయమూ
దొంగమాటెత్తేవు నయమూ!
దొంగపిల్లా నీకు దొంగలన ప్రీతటే!
దొంగల్ని తలచుకొని పొంగిపోతావుటే?
ముగ్గురూ తెల్ల వారేవరకూ మాట్లాడుకుంటూ ఉండిరి. రుద్రదేవి ఇరువురితో సకలాంధ్రదేశములోనూ కాకతీయవంశం అంటే కొందరు తిరుగుబాటు చేయబోతున్నారనీ, అందుకు కారణం తాను స్త్రీఅయి సామ్రాజ్య సింహాసనం అధివసింప నుండుటయే అనిన్నీ, అందుకు శ్రీ శివదేవయ్య దేశికులు, ప్రసాదాదిత్యప్రభువు ప్రతిఎత్తుకుగా చేస్తున్న కృషీ అవన్నీ చూచాయగా వివరించింది. రాజద్రోహం ఆచరించేవారి పేరులు మాత్రం బయటపెట్టలేదు.
మాటలు చెప్పుకొని చెప్పుకొని ఆ బాలలు ముగ్గురు విపులమై పాలసముద్రంలా ఉన్న రుద్రదేవి తల్పంపై ఒడ లెరుగక నిదురపోయిరి.