ఇంతటితో జాలించక, నాడు మొదలు గార్హస్థ్యధర్మములను సరిగా నడుపుచున్నది లేనిది. బెంజమిను పరీక్షించుకొనుచుండెను. దీని ఫలితమును ముందు జూడగలము.
ఆనాఁడట్లాంటికు మహాసముద్రము జలార్ణవమే, 'బెర్కుషియరు' యోడలోని వారు మరియొక యోడను జూచుసరికి, 50 దినములయ్యెను. ఈయోడ స్నేహపక్షము వారిదైనందున, వారు జూచి సంతసించిరి. అది దగ్గిఱకు వచ్చుట వలన, దానిలో నున్న ప్రయాణికులతో వీరు మాటలాడిరి. దానిని చూచుటవలన బెంజమినుయొక్క మనస్సు కరగెను.-"ఇది 'స్నో' అను పేరుగల యోడ. స్త్రీ పురుషు లేబదిమంది నెక్కించుకొని, 'డబ్లిను' పట్టణమునుండి 'న్యూయార్కు' కు బోవుచున్నది. ఇందులోని వారందఱు తట్టుపైకి వచ్చి మమ్ములను జూచి సంతసించినట్లు నాకు గనబడెను. ఇట్లు దైవికముగ, మహాసముద్రముమీద రెండోడలు గలిసినపుడు, వానిలోని యాత్రికులెంత సంతసింతురు' వారి మనస్సులలో నెంత యుల్లాసము కలుగును! ఆ యోడలోని వారి ముఖములను జూడగ, సంతోషముచే నాహృదయము తపతపలాడి, యంత:కరణ పూర్వముగ బయలు వెడలినందున, నే నానందమును పట్ట లేక పోతి" నని బెంజమిను వ్రాసెను.