మునుగుటకు తగిన నీరైనలేదు. రాత్రియంతయు గాలి దెబ్బ తినుచు, దోనెలోనుండుట కష్టమైనను, మరుచటి దిన ముదయమున దోనెవాడు వచ్చినపుడు మేము తెల్లముఖము వేయవలసి వచ్చునని విచారించుచుంటిమి. ఒక యరగంటవఱకు గుజగుజ లాడి క్రింద మీదుపడితిమిగాని, కార్యము లేక పోయెను. చేతులు నులుపుకొనుచు గూర్చుంటిమి. ఒడ్డున చేరుమార్గము కనబడదాయెను. సముద్రపు సోషతగ్గెను. క్రిందికి దిగిన, గొంతుక మోయ బురదలో దిగబడవలసి వచ్చును. అప్పుడు తెగించి, యిరువురము బట్టలు తీసివేసి, క్రిందికి దిగి, మామోకాళ్లతో 50 గజముల వఱకు దోనెను గెంటుకొనివచ్చి, నీటిలో దానిని తేల్చితిమి. ఒకటే తెడ్డుండుటచే, గష్టముతో మే మొడ్డున జేరితిమి. మాతోవచ్చిన, వారందఱు బసలో మమ్ములకై ఎదురుచూచుచుండిరి. ఆ రాత్రి మే మొడ్డున గడిపితిమి. మా విహార మిటుల ముగిసె"నని బెంజమిను వ్రాసెను.
స్పిత్ హెడ్ వదలిన మూడువారములకు ఈప్రయాణికులు అట్లాంటికి మహాసముద్రమును జూచిరి. ప్రయాణము దీర్ఘమై, విసుగు పుట్టించెను. ఈ ప్రయాణములోనే, గతించినకాలములోని తప్పులను స్మరణకు దెచ్చుకొని, ముందుకు బాగుగ నడచుటకై, బెంజమి నొక నడవడిపట్టికను వ్రాసెను. తరువాత కొందఱాపట్టిక దొరకలే దనిరిగాని, ఇటీవల బెంజమిను స్వహస్త లిఖిత ప్రతి యొకటి లభించినది.