లండను పట్టణమం దచ్చుకొట్టుటను నేర్చుకొనిన బెంజమినుయొక్క జ్యేష్ఠభ్రాత, జేమ్సు ఫ్రాంక్లిను, బోస్టను పట్టణమునకు వచ్చి స్వంతముగ ముద్రాక్షరశాలను బెట్టెను. ఒకసంవత్సరమునకు పైగా నితని కచ్చుపనిలేక యుండెను. వర్తకులకు చిన్న పుస్తకముల నచ్చువేసి యిచ్చుటయు, స్త్రీల కుపయోగమైన పట్టు, నార, చీట్లమీద ముద్రించుట, మొదలుగాగల పనుల జేయుచు వచ్చెను.
తండ్రి కుమారులు కార్ఖానాలను గ్రమముగ దిరిగి చూచినపుడు, ముద్రకుని వ్యాపార మంతగ వీరికి వచ్చినట్టు కనబడదు. ఎందుచేత నన, ఈ వ్యాపారము జేయుచున్న జేమ్సు కంతగా లాభము లేనందున, కుటుంబములో నిదివఱకే యొక డావ్యాపారము జేయుటయే, చాలు నని తండ్రి యెంచెను.
జేమ్సు ఫ్రాంక్లిను వ్యాపార మారంభముచేసిన రెండవ సంవత్సరమున, బెంజమినుకు గ్రంధపారాయణయందుండు అపరిమితాభిలాషను తల్లిదండ్రులుచూచి, చాల యాలోచనపైని, ముద్రకుని వ్యాపారమును నేర్చుకొనుటకై, జేమ్సుకు శుశ్రూష చేయునట్టులు బెంజమినును నిర్ణయించిరి. ఓడప్రయాణాభిలాష మనోగతమైనందున, నీ గురుకుల వాసమునకు బెంజమిను మొదట శంక జేసెనుగాని, తుదకు సమ్మతించి, దీని పూర్వోత్తర మంతయు తన చరిత్రలో వ్రాసికొనెను.