వలన లాభమును బొంది, ప్రస్తుత మవిలేనందున నిండు వ్యసనమును బొందిరి.
చందాతీసి, పుస్తక భాండాగారము నొకటి లేవనెత్తవలెనని బెంజమిను యోచించెను. ప్రతిచందాదారుడు ప్రధమమున సంచికలను గొనుటకు రెండు కాసుల నిచ్చి, ప్రతి సంవత్సరము సుమారెనిమిది రూప్యముల నిచ్చుకొనవలసిన దని, బెంజమి నేర్పాటుచేసెను. అక్కడ ధనము నిచ్చువారు లేరు. చదువుకొనువారు లేరు. దానియం దాసక్తియున్న వారులేరు. అందుచేత, చందాతీయుట కష్టమయ్యెను. నలుగురినిచూచి, వారితో దాను స్వయముగ చెప్పి, వారి చేత నితరులకు చెప్పించి, యితడు కష్టపడెను. అనుకొనిన 5 నెలలకు, 1731 సంవత్సరము నవంబరు వచ్చుసరికి, 50 చందాదారులు గూడిరి. 1732 సంవత్సరము మార్చి నెలవచ్చుసరికి, చందాసొమ్ము వసూలుకాబడెను. ఇంగ్లాండునుండి పుస్తకములను దెప్పించుట కితడు వ్రాసెను. 'కాలిన్సు' పుస్తక భాండాగారపు కార్యాధ్యక్షుడుగ, ముప్పదిసంవత్సరము లుండెను. స్నేహితులు కృపతో గొన్ని పుస్తకములను బహుమతి చేసిరి. అవి వచ్చినతరువాత, ప్రతిదానిని ప్రతి చందాదారుడు చదివి ముఖ్యాంశముల నెత్తి, వ్రాయవలసిన దని యొక పద్ధతి నందఱి సమ్మతముపైని బెంజమిను వ్రాసెను.