అక్కడ పదునైదు సంవత్సరములు తెలుగుపండిత పదవి-ఆసందర్భమున ననేకులు వీరిచేతిలో గవులైరి. విశ్వనాధ సత్యనారాయణ ప్రభృతు లావిధముగా శిష్యులు. తిరుపతి కవుల శిష్యులము, విశేషించి వేంకటశాస్త్రిగారి శిష్యుల మనువారిలో అవ్వారి, వేటూరి, వేలూరి, కాటూరి, పింగళి కవులు ముఖ్యులు. బందరు వేంకట శాస్త్రిగారిని బ్రహ్మరథము పట్టినది. 'కృష్ణ' వీరి పలుకు విని పొంగిపోయినది. 1933 సం. బందరు పౌరుల ప్రోత్సాహమునను, కవిశిష్యుల యభినివేశమునను శాస్త్రిగారికి జరిగిన షష్టిపూర్తి సన్మానము చరిత్రలో రమణీయము, నవిస్మరణీయము నయిన ప్రధానఘట్టము. ఆ సుసమయమున వీరి శిష్యప్రశిష్యు లనేకులు కావ్యోపహారము లర్పించి ధన్యులైరి. ఆ దివ్యమహముననే-
పుడమిఱేడులు తల లడుగులు మోపంగ
నర్పించు కాన్కల నందువాడు
అత్యద్భుతంబైన యవధానవిద్యకు
బ్రభవకారణమైన ప్రతిభవాడు
వీనుదోయికి దేనె సోనలు వర్షించు
వాజ్మాధురికి బేరు వడినవాడు
చిననాడె వలచి వచ్చిన కవితాకన్య
నేకపత్నిగ జేసి యేలువాడు.
పూర్ణకాముండు త్యాగియు భోగియైన
గురుని ఋణ మీగుపొంటె నీ చిఱుతకబ్బ
మర్హత గడించుకొనుగాక యాంధ్రవాణి
కడకనుల జాల్కొను ప్రసాదళణ లవాప్తి
అని గురుదక్షిణగా 'సౌదరనంద' కావ్యము పింగళి కాటూరి కవి యుగళముచే వేంకటశాస్త్రిగారి కర్పింపబడినది. ఆ షష్టిపూర్త్యుత్సవము తెలుగువాణి కొక యుజ్జలాలంకారము. ఇది యననేల? తిరుపతి