ఈకవియే మొట్టమొదట దెలుగు గ్రంథములలో తురకమాటలు లోనగు నన్యభాషాపదములను స్వేచ్ఛముగా బ్రయోగింప నారంభించినాడు. ఆంధ్రకవితాపితామహుని యీక్రింది చాటుపద్యములో దురుష్కభాషావాక్యమే వేయబడినది.
మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచే బడ్డ దు
ర్దమదోర్దండపుళిందకోటియవసవ్రాతంబు సస్తాశ్వ మా
ర్గమునం గాంచి శబాసహో హరిహరంగాఖూబు ఖోడాకి తే
తుముకీబాయిల బాయిదేమలికియందు ర్మింటికిం బోవుచున్.
ఈతని జూచి యాకాలమునందలి యితరకవులును దమచాటు పద్యములలోను గ్రంథములలోను యవనభాషావాక్యాదులను జొప్పించిరి. అట్టివారిలో నొక్క డగు నందితిమ్మన్న యొకచాటుపద్యములో-
శా. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచే
గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిఝ్ఝరీపోషణీ
మాయాభీకుముటూకులోటుకుహుటూ మాయాపటా జాహరే
మాయాగ్గేయ మడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్.
అన చెప్పియున్నాడు. ఈలాగుననే పెద్దనార్యుడు గ్రంథములలో నన్యభాషాపదములను బ్రయోగించినందుకు మనుచరిత్రములోని యీక్రిందిపద్యమును దృష్టాంతముగా జూపవచ్చును-
సీ. పచ్చనిహురుమంజివనివాగెపక్కెర పారసిపల్లంబు పట్టమయము
రాణ నొప్పారు పైఠాణంబుసింగిణి తళుకులకోరీలతరకసంబు
మిహి పసిండిపరుంజు మొహదాకెలంకుల ఠావుగుజ్జరివన్నె కేవడంబు
డా కెలంకునసిరాజీకరాచురకత్తి కుఱగట గ్రొవ్వాడి గొఱకలపొది
పీలికుంచె తలాటంబు పేరొజంబు
మణులమొగముట్టు బన్ని సాహిణియొకండు