సహాయముచే వాని జంపి కీశ్వరఖానునకు దివాన్గిరినిచ్చెను. కాని కొంతకాలమునకు వాడును కృతఘ్నుడయి రాణిమీద గొన్నిదోషముల నారోపించి యామెను సాతార కిల్లాలో కైదుచేసి యుంచెను. చాందబీబీని కైదుచేసిన పిదప కీశ్వర్ఖాను రాజ్యము నందంతటను విశేషసంక్షోభము చేయసాగెను. దాని నెవరును మాన్పలేక యుండగా యెకసాల్ఖానను సిద్దీ సరదారుడొకడు వాని నచటనుండి వెడలగొట్టి చాందబీబీని విడిపించి తెచ్చెను. తదనంతర మామె యెకసాల్ఖానును వజీరుగా నేర్పరచి రాజ్యము నేలుచుండెను. అప్పుడాతడు పాతనౌకరుల నందరినితీసి క్రొత్తవారిని నియమించెను. అక్కాలము నందు విజాపురమునందలి జనులు మంత్రిత్వము ఉన్ఉల్ముల్కసిద్దీ కియ్యవలెనని కొందరును, అబుల్ హసనను దక్షణీ తురక కియ్యవలెనని మరి కొందరును ఇట్లు రెండు పక్షములుగా నుండిరి.
ఇట్లు రాజ్యంబులో నంత:కలహంబులు జరుగుచుండగా మూర్తిజా, నిజామ్షహా కులీకుతుబ్షహ వీరిద్దరును అహమ్మద నగరముపైకి దండు వెడలి దానిని సమీపించిరి. అప్పుడచట బ్రజలలో బొత్తుగా నైక మత్యము లేక యుండినందున వైరులకు మిగుల ననుకూలముగా నుండెను. ఇట్టి సమయమునందు చాందబీబీ మిగుల యుక్తిగా లోకులను సమాధానపరచి అబ్దుల్ హసనునకు బ్రధానిత్వ మిచ్చి రెండు పక్షములవారిని నొకటిగాజేసి శత్రువులను మరలిపోవునట్లు చేసెను! షహాలు తమతమ నగరముల కరిగిన పిదప దిలార్ఖానను సిద్దీ మిక్కిలి గర్వించి అబ్దుల్హసనును జంపించి తానే ప్రధాని యయ్యెను.