దెచటజూచినను హాహాకారములే వినబడుచుండెను. ప్రజలన్నాహారములకై తిరుగజాలకుండిరి. వారి దైన్యమును గని రాణిగారు వారికొక యన్నసత్రము నేర్పరచిరి. ఆంగ్లేయసైన్యంబుల నుండి నారాయణాస్త్రతుల్యములగు గోళములవలన తనసైన్యంబులు దీనముఖంబు లగుట గని లక్ష్మీబాయి యంతటితో ధైర్యము వదలక సైనికుల కుత్సాహమును గలుగజేసి యాంగ్లేయసైన్యములను ధిక్కరించెను. ఇట్లీ యుభయసైన్యములును బీరువోవక మార్చి 30 వ తేది వరకును సంగ్రామం బొనర్చు చుండెను. ప్రతిపక్షులగు ఆంగ్లేయసైన్యమున కనేక సేనానాయకులుండి నడుపుటవలనను, సైనికు లదివరకే యుద్ధమున కనుకూలమగు శిక్షను గరచియుండుటచేతను, వారి సైన్యములు చెదరక యుద్ధము చేసి గెలుపొందుట యొక వింతకాదు. ఇక రాణిగారి సైన్యములన్ననో యుద్ధశిక్ష నెరుగనట్టి స్వాతంత్ర్య వీరులతో గలిసి జనసంఖ్య కెక్కువగా గానుపించినను, వార లందరొక ప్రకారము యుద్ధము చేయజాలనందున విశేషముగా బెదరుచుండిరి. ఇంతటి విశేషసైన్యమున కంతకును రాణిగారే సేనానాయకత్వము వహించి నడుపుట బహు దుర్ఘటమని యందరకును దెలిసినదే. అయినను ఆ వీరవనిత తన బుద్ధిచాతుర్యమువలనను, శౌర్యసంపదవలనను ప్రఖ్యాతులగు ఆంగ్లేయ సేనానయకులతో బ్రతిఘటించి యుద్ధభూమిని నిలిచి యనేక దినములు సంగ్రామము సల్పి, వారిచే 'నీమెను గెలుచుట దుర్ఘట' మనిపించుట మిగుల వింత గదా?
పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/201
ఈ పుట ఆమోదించబడ్డది