ఖండ పొలిటికల్ అసిస్టెంటు యేజంటగు మేజర్ యేలీసుదొరగారినిని, సేనాధిపతియగు క్యాప్టన్ మార్టిన్ దొరగారినిని బిలిచిరి. వీరందరి సముఖముననే దత్తవిధానము జరిగి ఆనందరావు పేరు దామోదరరావని పెట్టిరి.
ఇట్లుదత్తవిధానమయిన పిదప గంగాధరరావుగారు దివానుగారిచే వినతి పత్రము హిందూస్థానపు దొరతనమువారికి వ్రాయించి దానిపై తమవ్రాలు చేసిదానిని తమ హస్తములతో పొలిటికల్ అసిస్టెంట్గారి కిచ్చిరి. అందులో బూర్వ మింగ్లీషు వారు తన తండ్రిగారితో జేసిన కరారు ప్రకారము తమ వంశ పారంపర్యముగా రాజ్యము దొరకవలయుననియు, తనకు నౌరససంతతి లేనందున నొక దత్తపుత్రుని స్వీకరించితిననియు, దొరతనమువా రాదత్తవిధానమునకు సమ్మతించి వానికి రాజ్య మొసంగి వాడు పెద్దవాడగువరకు వాని పేర తనపత్నియగు లక్ష్మీబాయి పాలించునట్లు చేయుడనియు వ్రాసిరి. విజ్ఞాపన పత్రిక వ్రాసిన దినముననే గంగాధరరావు పరలోకగతుడయ్యెను. కులాచారప్రకారము రాజుగారికి ప్రేతవిధులన్నియు జరుపబడెను. తదనంతరము గొన్ని దివసంబులకు లక్ష్మీబాయి సర్వానుమతంబునం దనపుత్రునకు రాజ్యమిమ్మని దొరతనము వారికొక విజ్ఞాపన పత్రికను వ్రాసెను. కాని యామె యుద్దేశ్యము సిద్ధించినది కాదు.
ఆ విజ్ఞాపన ప్రకారము దొరతనమువారు తమదత్తతను స్వీకరించి రాజ్యమిత్తురని ఝాశీ సంస్థానమున నందరును కొండంత యాసతోడ నుండగా 1855 వ సంవత్సరము