వారిరువురు నొకయుక్తివలన నా తురుష్కుని జంప నిశ్చయించు కొనిరనియు, అందుపై చాందుభట్టు గోరీయొద్దకి వెళ్లి ప్రసంగ రీత్యా పృథివీరాజు యొక్క బాణనైపుణ్యమును వర్ణింపుచు, నాతడిపుడు కన్నులు లేకున్నను శబ్దము జాడపట్టి సూటిగా భాణము వేయునని చెప్పగా, గోరీ యా విచిత్రమును గనుటకై యొక సభజేసి, యాసభకు పృథివీరాజును బిలిపించి యతనికి నతని విల్లు బాణములిచ్చి చమత్కార మేమయిన జూపుమని యాజ్ఞాపించెననియు, ఆమాట సూటినిబట్టి పృథివీరాజాతనిపై బాణమువేయ నాతడు (గోరీ) మృతినొందె ననియు, తదనంతరము చాందుభట్టు పృథివీరాజు లిరువురును దురకల చేబడక యా సభయందే యొకరినొకరు పొడుచుకొని జీవములను విడిచిరనియు, మరికొందరు చెప్పెదరు. పైని జెప్పబడిన శరసంధాన మహోత్సవమంతయు మనదేశముననే జరిగినదని యొకరును, తురకదేశమున జరిగెనని ఇంకొకరును వక్కాణించెదరు. వీనిలో నేది నిజమో మనము చెప్పజాలము.
గోరీకి జయముకలిగి, వాడు డిల్లీకి వచ్చిచున్న వాడనిన వార్త వినగానే, పట్టణములోని స్త్రీలందరితో సంయుక్త అగ్ని ప్రవేశము చేసెను. గోరీ డిల్లీకివచ్చి చూచునప్పటికి గ్రామమంతట భస్మరాసు లవిచ్ఛిన్నముగా గానవచ్చుచుండెను.
- ________