పుట:శృంగారనైషధము (1951).pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

11


శ్రీనాథునిశైలి

నన్నయ సంకల్పించి నాచనసోముఁడు కొంతవఱకుఁ గొనసాఁగించిన శయ్యాసౌభాగ్యము శ్రీనాథునివలనఁ బరిణతిఁ జెందినది. ప్రబంధకవులకును, బురాణేతిహాసకర్తలకునుగల ప్రధానమైనవాసి యీశయ్యయందే గలదు. తిక్కనాదు లర్థము నారాధించిరి గాని శయ్యను గాదు. ప్రబంధకవులు శయ్యాసంపాదనార్థమై శబ్దము నారాధించిరి. అర్థమును గౌణము చేసిరి. వారికి నీత్రోవచూపినవాఁడు శ్రీనాథుఁడు కాని, శ్రీనాథునివిషయమున మాత్రము క్వాచిత్కముగాఁ దక్క నర్థమును శబ్దమునుగూడఁ బ్రథానములే. ఇతనిశయ్యలో జిగిబిగులు రెండును గలవు. ఇతనివాక్కు మిక్కిలి భావభరితము కావుననే యితనిశైలి యుద్ధండముగా నుండును.

శ్రీనాథునిజీవితచరిత్ర వ్రాయుటనఁగా బదునేనవశతాబ్ది యాంధ్రదేశచరిత్రవ్రాయుట యని శ్రీచిలుకూరి వీరభద్రరావుగారొకచో వచించియున్నారు. ఆకాలమున నుచ్చస్థితిలో నున్న యాంధ్రకర్ణాటకరాజ్యములతో నతనికిఁగలసంబంధము, నానామంత్రులతో నతనికిఁగలమైత్రి నానాదిశల నాతఁడొనర్చిన సంచారము - ఇత్యాదు లతని నాంధ్రలోకైకకవిగాఁ జేసినవి.

ఇఁక మిగిలినదొక్కటి. చంద్రునకు నూలుపోగన్నట్టులు శ్రీనాథమహాకవిచక్రవర్తిఁగూర్చి రెండువాక్యములు వ్రాయ నాకవకాశమిప్పించిన శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రుల వారికి మిక్కిలి కృతజ్ఞుఁడను.

టీచర్స్‌కాలేజి, సైదాపేట, మద్రాసు

వృష, ఆషాఢ శు 5.

ఇట్లు,

గ. శ్రీ. న. ఆచ్వార్య