పుట:భాస్కరరామాయణము.pdf/423

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నీరజాసను మెప్పించి నీవు గన్న, వరము లనిమిషాసురయక్షవరులవలన
భయము లేకుండ నంతియ పంక్తివదన, కపుల నృపులచేఁ జాకుండఁగాదుసుమ్ము.

420


క.

నాకుం జూడఁగ విష్ణుఁడు, లోకము రక్షించుకోఱకు లోలత రఘురా
మాకృతి గయికొన్నాఁ డటు, గా కున్న మనుష్యు లబ్ధిఁ గట్టెడువారే.

421


వ.

అట్లుం గాక.

422


సీ.

జంతువు లొం డొండు జాతుల నీనుట, పెల్లు గర్జిల్లుచుఁ బెనుమొయిళ్లు
నెత్తురు గురియుట నిష్ఠురంబుగ శారి, కలు రొదసేయుట గములు గట్టి
నక్కలు నెలవుల నగరవీథులఁ బట్ట, పగలు వాపోవుట బలులఁ గాకు
లంటకుండుట గూబ లంతఃపురంబులు, సొచ్చుట సేనలు సొంపు చెడుట
గలిగియున్నది మఱియు నుగ్మలియొకర్తు, శాతదంష్ట్రలు బభ్రుకేశములుఁ గృష్ణ
దేహమును నట్టహాసప్రదీప్తముఖము, నగుచు లంకలోఁ దిరిగెడు నట్లు దోఁచు.

423


క.

వికటఘనపిశంగాక్షుం, డొకముండితశీర్షదేహుఁ డోడక యింటిం
టికి వచ్చి తొంగి చూచి వె, దకినం బొడలేక యడఁగు దశముఖ వింటే.

424


వ.

ఇట్టిమహోత్పాతంబు లనేకంబులు పుట్టుచున్నవి వృథావిరోధంబు విడిచి
నావచనంబు లవధరింపుము.

425


శా.

లంకారాజ్యము సేయుచున్ జగము లెల్లం దల్లడిల్లన్ నిరా
తంకక్రీడల నుండి యుండి పరకాంతం దెచ్చి తీకార్య మే
వంకం గీ డిది యేల పుచ్చు మరలన్ వైదేహి నీ కుండితే
నింకన్ నీదుకులాబ్ధిపై నిగుడుఁ జుమ్మీ రామునుగ్రాస్త్రముల్.

426


క.

అని పలికి యతనిబొమముడి, గనుఁగొని మఱి యొండుఁ బలుకఁగా నోడి దశా
నన ముదుకఁ గాన మదిఁ దోఁ, చిన చందం బగునొ కాదొ చెప్పితి నీకున్.

427


క.

నావుడు నాఖలుఁ డిట్లను, నావిక్రమ మింద్రుఁ డెఱిఁగినం జాలు బలే
నీ వింక నొండు పలికిన, నావలనన్ మాన్యుఁ డైన నగుము సహింపన్.

428


క.

జడనిధి గట్టుటయును నొక, కడిమియ యని పగఱ నింతగాఁ జెప్పిన నే
విడుతునె సీతఁ దగవు ని, న్నడిగితినే నోరికొలఁదు లాడెద విచటన్.

429


క.

జనకుఁడు వెడలం దోచిన, వనమునకుం గడిమి విడిచి వచ్చినవాఁ డా
మనుజుం డటె రక్షోనా, థు నెదుర్చు సురాసురేంద్రదుర్జయు నన్నున్.

430


వ.

అని పలికిన మాల్యవంతుండు నిరుత్తరుం డై కొండొకసేవునకుం గొలువు వెడలి
మందిరంబునకుం జన రావణుండు నమాత్యసమ్మతిం జతుర్థోపాయంబ కార్యం
బనునిశ్చయంబున ననేకానీకంబులతోఁ బురంబు తూర్పువాకిటికిం బ్రహస్తుండు
దక్షిణద్వారంబునకు మహాపార్శ్వమహోదరులును బడమటిగవనికి నింద్రజిత్తు
నుత్తరగోపురంబున నేను మీరు ననుచు శుకసారణులం బలికి మధ్యమస్కంధం
బునకు విరూపాక్షునిం బనిచి నిజనికేతనంబున కరిగె నంత నక్కడ రఘుపుంగ