7
సోమనాథుఁ డీగ్రంథమువలన నీశ్వరాధిక్య, జంగమ, ప్రసాద, భక్తి మహిమలను వ్యాప్త మొనరించినాఁడు. కావుననే యీతని కంకితముగా "అన్యవాదకోలాహలము” అను శతకమును రచించిన యీతని శిష్యప్రశిష్యుఁ డాకృతిలో—
| "మీరు చతుర్వేదసారంబు చేసిన | |
అని యీగ్రంథమును బ్రత్యేకముగఁ బ్రశంసించినాఁడు.
ఛందోవిశేషములు
సోమనాథునికవితలోఁ గాననగు ఛందోవిశేషములు కొన్నిటి కీచతుర్వేదసారముకూడ నాదర్శముగానున్నది. వ్యస్తపదగతరేఫసంయుక్తాక్షరమునకుఁ బూర్వమందుండు వర్ణమును గురువుగనే గాక తేల్చి పలికి లఘువుగాఁగూడఁ జేసికొనుట పూర్వలాక్షణికసమ్మత మనుట పలువురకుఁ దెలిసిన విషయమే. ఈవిధిని సోమనాథుఁడు కొన్నియెడలఁ బ్రత్యేకశబ్దమధ్యస్థరేఫసంయుక్తాక్షరపూర్వవర్ణవిషయమునఁ గూడఁ బాటించుట యొకవిశేషము. అట్టి విందలిపద్యములలో నెడనెడఁ గాననగును. మచ్చునకు 134 పద్యమున "రుద్రపశుపతి బ్రహ్మరూపుఁ గొనఁడె” అనుప్రయోగము చూడుఁడు.
రేఫసంయుక్తాక్షరపూర్వవర్ణవిషయమునఁ బాటింపఁబడు నీపాక్షికవిధిని గొందఱు కవులు అంతస్థములు (Semi vowels) లోని యితరవర్ణములయిన య, ల, వ, లతో సంయుక్త ములయిన యక్షరముల ముందుండు వర్ణవిషయమునఁ గూడఁ బాటించియున్నారు. సోమనాథునికిఁ గూడ నిది సమ్మతమే యని తోఁచును. "శ్రీ రుద్ర జాబాల శ్వేతాశ్వతరబృహదారణ్య" అను 9వ పద్యమున వకారసంయుక్తమయిన 'శ్వే' యనునక్షరమునకుఁ బూర్వమున్న జాబాలశబ్దమందలి లకారమును దేల్చి పలికి లఘువుగాఁ జేసికొననిచో గణభంగ మగునుగదా!