42
కాశీమజిలీకథలు - ఐదవభాగము
తల్లి - అట్టి వరము నాకిమ్ము. సన్యాసికృత్యము కాదని మానెదవేమో సుమా!
శం — తల్లీ ? యుల్లంబునఁ జింతింపకుము. నీకట్టి వరమిచ్చితిని మరియు ననాథనగు నన్ను విడిచి యేగుచున్నవాఁడు వీడు నిర్భయుఁడని తలంపవలదు. దూరముననున్నను నీయొద్దనుండు నప్పటికంటె నూరు రెట్లధికముగాఁ పరామర్శింపుచుందును సుమీ.
తల్లి - బిడ్డా? అదియే నేను గోరుచుంటిని. అయ్యో నీవరిగెదవనిన నా గుండెలు కొట్టికొనుచున్నవి యింటనుండి యేమి చేయుదును. నీవరిగిన నిమిషము బ్రతికియుందునా? నన్నుఁగూడఁ దీసికొనిపొమ్ము.
శం — తల్లీ? మరల మోహమందెదవేమిటికి నద్వైతతత్త్వమును దెలిసికొనుము. ఎవ్వరికెవ్వరును లేరు. తన్నుదారక్షించు కొనవలయు. నీవు నావెంట రారాదు. ఆత్మతత్త్వమును ధ్యానించుకొనుచు నిండియొద్ద నుండుము. మమకార ముడుగుమని యనేక ప్రకారములు బోధించి యామెకు వైరాగ్యప్రవృత్తి గలుగఁజేసి పిమ్మట జ్ఞాతులనెల్ల రప్పించి యిట్లనియె.
శంకరుండు తల్లిని జ్ఞాతుల కప్పగించుట
చ. ఎడదను గన్నతల్లియని యించుకయుం దయలేక వృద్ధన
న్విడిచి విరాగియై యరుగు వీఁడనియారటమందు నీమె మీ
కడనిడి యేగుచుంటి నెటు గాంచెదరోకద బంధులార! యీ
బడుగుబడంతి మీ జనని బాతిఁ దలంచి కృపన్ భజింపుడీ.
క. ననుమరచునట్టు లాదర
మున జూచుచునుండుఁ డీమె మోహం బొప్పన్
ననుదలచి కంటఁదడి వె
ట్టిన మీకును నాకునున్ ఘటించునఘంబుల్.
క. ఇడుమల నెరుఁగదు మాట
ల్వడదిమ్మని యడుగదేమి లాతులయింటన్
గుడిచి యెరుంగదుతలఁపఁగఁ
గడుమెత్తని దీమె నెట్లు కాపాడెదరో.
గీ. సకలభూవిత్త పశుగృహ సహితముగను
నాదుజనయిత్రి మీయధీనఁగ నొనర్చి
యేగుచుంటిని దయమాలి యింతమీఁద
మీదె యామెభరంబు దాయాదులారా.